భారతదేశము నా మాతృభూమి...." ప్రతిజ్ఞ "



భారతదేశము నా మాతృభూమి...." ప్రతిజ్ఞ " అందించిన మన తెలుగు వాడు..


 కొత్త రూపం:

భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.

పాత రూపం:

భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరు నా సహోదరులు.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.
నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

ప్రస్తుతరూపంలో చేసిన ప్రధానమైన మార్పు "అర్హుడనగుటకై" స్థానంలో లింగతటస్థతను సూచించే "అర్హత పొందడానికి" అనే పదాలను చేర్చడం. దానితోబాటుగా భాషను వాడుకభాషకు దగ్గరగా ఉండేటట్లు సరళీకరించినట్లు కూడా గమనించవచ్చు.


చదువుతుంటే ... చిన్నప్పుడు  బడిలో రోజూ చేసిన " ప్రతిజ్ఞ "  గుర్తొస్తుందా? అప్పుడు అర్ధమయ్యీ  అవ్వక పోయినా ,దాని వెనకనున్న  స్పూర్తి ఇప్పటికీ  వెంటాడుతుంది కదూ!

మన మనసులపై  అంతటి మహత్తర  ముద్ర వేసిన ఈ " ప్రతిజ్ఞ " 1962  లో పుట్టింది .


పాఠశాలల్లో ఏ విద్యార్ధి నోట విన్నా....ఒకిటో తరగతి నుండి పదో తరగతి వరకూ ఏ పుస్తకం తొలి పేజీలో నైనా కనిపించే ఈ "భారత జాతీయ ప్రతిజ్ఞ" రూపకర్త శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు.

- దేశానికి  జాతీయ   పతాకాన్ని అందించినట్లే ...జాతీయ ప్రతిజ్ఞను అందించిన ఘనత మన తెలుగువాడిదే!

ప్రతీ భారతీయుడి  బాధ్యతను గుర్తు చేసేలా  సాగిన ఈ రచన మన జాతీయ గీతం,జాతీయ గేయాల తరువాత స్థానం  సంపాదించుకుని మన తెలుగు 'వాడికి ప్రతీకగా నిలిచింది.

 నల్లగొండ సమీపంలోని "అన్నెపర్తి" పైడిమర్రి వారి స్వగ్రామం.
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీమద్భగవద్గీత

జీవితం