ఎనిమిది, తొమ్మిది, పది క్లాసుల పద్యభాగాలలోని చుక్క గుర్తు పద్యాలు కొన్ని




నా చిన్నప్పుడు  స్కూలు లో అప్పుడు చదువుకున్న చాలా పద్యాలు మనసులో అలా ఉండిపోయాయి. చిన్నప్పడు కలిసి తిరిగి ఆడుకున్న మిత్రులు పెద్దయ్యాక ఎదురుపడితే ఆ చిన్ననాటి మధుర స్మృతులు అగరొత్తుల సువాసనలా కమ్ముకున్నట్టు, ఆ పద్యాలు అప్పుడప్పుడూ పలకరిస్తూ ఉంటాయి.
నాకు గుర్తులేని మిగతా పద్యాలు ఇంకెవరికైనా గుర్తుంటే చెప్పండి. అవికూడా కలుపుతాను. ఇవి ఎనిమిది, తొమ్మిది, బహుశా పది క్లాసుల పద్యభాగాలలోని చుక్క గుర్తు పద్యాలు.

************************************************************************* 


                                పార్వతి తపస్సు
************************************************************************
 
ఇది శ్రీనాథుడు రచించిన కాశీఖండంలోది. పార్వతీదేవి శివునికోసం తపస్సు చెయ్యబూనడం సందర్భం.


ఎక్కడలేరె వేల్పులు సమీప్స్తిత దాతలు ముద్దుగూన నీ
వెక్కడ ఘోరవీర తపమెక్కడ యీ పటు సాహసిక్యముల్
తక్కు శిరీష పుష్ప మవధాన పరత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునొ నిశ్చయింపుమా



భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి యీశ్వరా
రాధన కేళి కౌతుక పరాయణయై ధరియించి బాండు ర
క్షాధృతి పూర్వకంబుగ బ్రగాఢ పయోధరమండలీ సము
త్సేద విశీర్ణ సంహతుల జెల్లు మహీరుహవల్కలంబులన్
@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@

                                     భాస్కరా!

@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@@#@

ఇవి భాస్కర శతకంలోని పద్యాలు.

చదువది యెంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా
****************************************************************

                                  స్వయంవరం
*****************************************************************

మొల్ల రామాయణంలో సీతాస్వయంవర సన్నివేశం.

గురుభుజశక్తి కల్గు పదికోట్ల జనంబును బంప వారునా
హరుని శరాసనంబు గొనియాడుచు బాడుచు గొంచువచ్చి సు
స్థిరముగ వేదిమధ్యమున జేర్చిన దానికి ధూపదీపముల్
విరులును గంధమక్షతలు వేడుకనిచ్చిరి చూడనొప్పగన్
 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

గుర్రం జాషువా అపురూప సృష్టి-శిశువు
 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

బొటవ్రేల ముల్లోకములు జూచి లోలోన
నానందపడు నోరులేని యోగి
తల్లి తండ్రుల తనూ వల్లరీ ద్వయికి వ
న్నియ పెట్టు తొమ్మిది నెలల పంట
అమృతంబు విషమను వ్యత్యాస మెరుగ
కాస్వాదింప చను వెర్రిబాగులాడు
అనుభవించు కొలంది నినుమడించుచు మరం
దము జాలువారు చైతన్య ఫలము
భాష రాదు, వట్టి పాలు మాత్రమె త్రాగు,
నిద్రపోవు, లేచి నిలువలేడు .. (చిన్ని నాన్న)
ఎవ్వరెరుంగ రితని దేదేశమో గాని,
మొన్న మొన్న నిలకు మొలిచినాడు!
ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ పాపాయి పద్యాలలోని కవిత్వం మాటకొస్తే పసిపిల్లవాడిమీద ఇంతకన్నా ఎవరూ బాగా పద్యాలు రాయలేరనేది కాదనలేని విషయం. ఆహారం,నీరు అనే వాని నెరుగకుండా తొమ్మిది నెలల పాటు చిమ్మ చీకటి కమ్ముకొన్న అమ్మ జానెడు పొట్టలో నిద్ర పోయి లేచి పురిటింటి నుంచి ప్రయాణం సాగించే బాటసారి అని తల్లి కడుపున ప్రాణం పోసుకొని ధరణిపై అడుగుపెట్టిన పాపాయిని నవనవోన్మేషంగా అభివర్ణించడం ఒక్క జాషువా వల్ల మాత్రమే అవుతుందనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.



 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

భారతదేశము నా మాతృభూమి...." ప్రతిజ్ఞ "

శ్రీమద్భగవద్గీత

జీవితం