నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్రం ఆమోదం

దేశీయ విద్యావ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క‌ మార్పుల‌కు కేంద్రం సిద్ధ‌మైంది. అంద‌రికీ విద్య‌ను అందుబాటులోకి తీసుకురావ‌డంతో పాటు.. కొత్త విధానాన్నిఅమ‌ల్లోకి తీసుకు రానుంది. ఈ మేర‌కు నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర‌ కేబినెట్ ఆమోదం తెలిపింది.

నూత‌న జాతీయ విద్యా విధానం ప్ర‌కారం.. నాలుగు దశల్లో కొత్త విధానం ఉండ‌నుంది. 5+3+3+4 విధానంలో దీన్ని అమలులోకి తీసుకురానుంది. అలాగే 3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత నిర్భంధ‌ విద్యను అందించాల‌ని నూత‌న విద్యా విధానంలో ముఖ్య‌మైన అంశంగా చేర్చింది.

కొత్త విద్యా విధానంలో సిల‌బ‌స్‌లో కూడా భారీ మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. వృత్తి విద్య‌తో పాటు, ఉపాధి లభించే విధంగా ఇది ఉండ‌నుంది. ఇక నూతన విద్యా విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సు, ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్, ఆ త‌ర్వాత చ‌దువుల‌ను గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారని సమాచారం. ఇందు కోసం ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేయ‌నుంది.

నిర్బంధ విద్య పొడగింపు

ప్రస్తుతం 14 ఏళ్ల లోపు విద్యార్థులకు అందిస్తున్న నిర్బంధ విద్యను నూతన విద్యా విధానం ద్వారా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు పొడగించారు. 2025 నాటికి ప్రీ-ప్రైమరీ విద్యను విస్తృతం చేయడం,ప్రతీ ఒక్కరూ సాధారణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా కొత్త పాలసీని రూపొందించారు. లభ్యత,నాణ్యత,సమానత్వం,జవాబుదారీతనం ప్రాతిపదికన దీన్ని రూపొందించారు.

5+3+3+4 పద్దతిలో...

నూతన విద్యా విధానంలో పిల్లల వయసు కంటే వారి జ్ఞాన అభివృద్ది దశల ఆధారంగా 5+3+3+4 పద్దతిలో విద్యా విధానాన్ని రూపకల్పన చేశారు. దీన్ని ఫౌండేషనల్ స్టేజ్(3-8ఏళ్లు-గ్రేడ్స్ 1-2),ప్రీ-ప్రైమరీ,ప్రిపరేటరీ(8-12ఏళ్లు-గ్రేడ్స్-3-5),మిడిల్ స్టేజ్(11-14ఏళ్లు-గ్రేడ్స్-6-8),సెకండరీ స్టేజ్(14-18ఏళ్లు-గ్రేడ్స్-9-12)గా విభజించారు. ఇంటర్ విద్యను పూర్తిగా రద్దు చేశారు. డిగ్రీ కోర్సుల కాల పరిమితిని నాలుగేళ్లకు పొడగించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో రీసెర్చ్‌ను కూడా భాగం చేసే అవకాశం ఉంది.

ఐదు వరకు మాతృ భాషలోనే... కొత్త విద్యా విధానంలో విద్యార్థులు కళలు, మానవతా శాస్త్రాలు, క్రీడలు, ఇతర వృత్తిపరమైన సబ్జెక్టుల అధ్యయనానికి అవకాశం కల్పించారు. అలాగే 2-8ఏళ్ల వయసు నుంచే ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకునేలా విద్యా విధానాన్ని రూపొందించనున్నారు. దేశవ్యాప్తంగా 8 స్థానిక భాషల్లో ఈ-కోర్సులను అందుబాటులోకి తీసుకోనున్నారు. ఐదో తరగతి వరకూ అన్ని స్కూళ్లలోనూ మాతృ భాషలోనే విద్యా బోధనా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయనున్నారు. ఇందుకోసం ఆరో తరగతి నుంచే విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలు బోధించనున్నారు. ఇప్పటిలా బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ఆలోచనా శక్తిని కాకుండా జ్ఞాన శక్తిని పరీక్షించేలా పరీక్షల రూపకల్పన చేయనున్నారు.
కొత్త విద్యా విధానంలో సంస్కృతానికి ప్రాధాన్యత కల్పించనున్నారు. సంస్కృత విశ్వ విద్యాలయాలకు కూడా పెద్ద పీట వేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నారు. ఇకనుంచి పరిశోధనలో ఎంఫిల్‌‌ను పూర్తిగా రద్దు చేయనున్నారు. అకడమిక్ క్రెడిట్ స్కోర్‌ను డిజిటల్ పద్దతిలో నిక్షిప్తం చేసేలా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ABC)ని ఏర్పాటు చేయనున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

భారతదేశము నా మాతృభూమి...." ప్రతిజ్ఞ "

శ్రీమద్భగవద్గీత

జీవితం