పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఎందుకీ వ్యతిరేకత.. అందులో ఏముంది?


పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఎందుకీ వ్యతిరేకత.. అందులో ఏముంది?


కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు మంగళవారం బంద్ నిర్వహించాయి. ర్యాలీలు, ఆందోళనలు, భారీ ప్రదర్శనలు నిర్వహించగా, ఇలాంటి బిల్లును తీసుకురావడం తగదని దాదాపు వెయ్యి మంది మేధావులు, కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదించి తాజా బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే నిర్దిష్ట నిబంధనలను పాటించిన కాందిశీకులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది. పౌరసత్వం కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో వ్యక్తులకు ఉండే సన్నిహిత సంబంధానికి ప్రతీక.
1955 నాటి చట్టానికి ఐదోసారి సవరణ
స్వాతంత్య్రానంతరం తొలిసారగా 1955లో పౌరసత్వ చట్టాన్ని రూపొందిచగా, ఇంతవరకూ నాలుగుసార్లు కీలక సవరణలు చేశారు. తాజాగా ఐదోసారి చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించింది. ఒక పక్క దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలుచేస్తామని చెబుతూనే పౌరసత్వ సవరణ బిల్లును ప్రతిపాదించింది. పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ఆరు మతాల వారికి పౌరసత్వ సవరణ బిల్లు రక్షణ కల్పిస్తుండగా, ఎన్‌ఆర్‌సీ మాత్రం మత ప్రాతిపదికన కాకుండా 1971 మార్చి 24 దేశంలోకి వచ్చి స్థిరపడిన అక్రమ వలసదారులను తిరిగి తమ దేశాలకు పంపించేలా చట్టాన్ని రూపొందించారు.

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ప్రధాన ఉద్దేశం ఇదే

ప్రస్తుతం అమలులో ఉన్న పౌరసత్వ చట్టం -1955లోని నిబంధనలను సవరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. నిబందనల ప్రకారం ఎవరైనా ఇతర మార్గాల్లో దేశంలో ప్రవేశిస్తే వారిని చట్ట వ్యతిరేక కాందిశీకులుగా పరిగణిస్తారు. ఎలాంటి పత్రాలు లేకుండా భారత్‌కు వచ్చి నిర్దేశిత సమయానికి మించి ఇక్కడే ఉండే వారిని అక్రమ వలసదారులుగా శరణార్థులుగా గుర్తిస్తున్నారు. తాజా సవరణతో అలాంటి వారికి భారతీయ పౌరసత్వం పొందడానికి మార్గం సుగమం అవుతుంది.

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వ్యతిరేకత

ఈ బిల్లు ఆమోదం కోసం ఈశాన్య రాష్ట్రాల పార్టీలతో కేంద్రం రాజీ కుదుర్చే ప్రయత్నం చేసింది. పౌరసత్వం పొందిన వారికి ఈశాన్య రాష్ట్రాల్లో స్థానికత కల్పించబోమని నచ్చజెప్పే ప్రయత్నం కేంద్రం చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ ప్రాంత నాయకులతో మూడు రోజులు చర్చలు జరిపారు. లోక్‌సభలోనూ తమ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ తూర్పు సరిహద్దు నిబంధనలు -1873 ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సిన అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో వర్తించే ప్రాంతాలు, అసోం, మేఘాలయ, త్రిపురల్లోని స్వయంప్రతిపత్తి ప్రాంతాలను ఈ సవరణల పరిధి నుంచి మినహాయింపు ఇచ్చారు.

పౌరసత్వ నిబంధనలపై రాజ్యాంగం ఏం చెబుతుంది?

పౌరసత్వంపై రాజ్యాంగం చాలా స్పష్టంగా నిర్వచించింది. రాజ్యాంగం పార్టు -2లో ఆర్టికల్ 5 నుంచి 11 వరకూ పౌరసత్వ నిబంధనలను వివరిస్తాయి. ఆర్టికల్ 5 ప్రకారం మన భూ భాగంలో జన్మించిన వారికి భారత పౌరసత్వం సిద్ధిస్తుంది. వారు భారత భూభాగంలోనే శాశ్వత నివాసం ఉండి, ఆ వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరైనా భారత భూభాగంలో జన్మించాలి.. లేదా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటికి కనీసం ఐదేళ్ల పూర్వం నుంచి వారు భారత భూభాగంలో నివాసం ఉండాలి. ఇది పౌరసత్వానికి సంబంధించి భారత రాజ్యాంగం చెప్పే నిబంధన.

పాక్ పౌరులకు భారత పౌరసత్వం ఎలా?

పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన వారికి కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 6లో నిబంధనలు పొందుపరిచారు. రాజ్యాంగం అమలులోకి వచ్చేనాటికి పాక్ నుంచి భారత్‌కు వలస వచ్చివారు కొన్ని నిర్దిష్ట అర్హతలు కలిగి ఉంటే వారిని సైతం భారత పౌరులుగా పరిగణిస్తారు. భారత ప్రభుత్వ చట్టం -1935 ప్రకారం.. ఆ వ్యక్తి పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన వ్యక్తి అయి ఉండాలి.. లేదా అతని తల్లిదండ్రులు లేదా వారి తాతలు ఎవరైనా భారత భూభాగంలో జన్మించి ఉండాలి. అంతే కాదు, 1948 జులై 18 కంటే ముందుగానే ఆ వ్యక్తి భారతదేశానికి వచ్చి ఇక్కడ నివసించినట్టయితే వారు కూడా భారతీయ పౌరులుగానే గుర్తింపు పొందుతారు. ఒక వేళ 1948 జులై 18 తర్వాత వలస వచ్చిన వ్యక్తులు తమను భారత పౌరుడిగా గుర్తించాలని భారత డొమినియన్ ప్రభుత్వం నియమించిన పౌరసత్వ రిజిస్ట్రీ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందు ఆరునెలలుగా ఇక్కడే నివసించి ఉండాలి. భారత రాజ్యాంగం అమలులోకి రాకపూర్వమే అతని దరఖాస్తు ఆమోదం పొంది ఉండాలి.

ఆర్టికల్ 11 ప్రకారం పౌరసత్వ చట్టానికి సవరణ

రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 కింద పౌరసత్వ చట్టంలో సవరణలు చేసే విశేషాధికారం పార్లమెంట్‌కు కల్పించారు. ఈ అధికరణం కిందనే భారత పార్లమెంటు పౌరసత్వ సవరణ బిల్లును ప్రతిపాదించింది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును గతంలో ప్రతిపాదించగా, లోక్‌సభ 2016లోనే ఆమోదించింది. రాజ్యసభలో అది ఆమోదం పొందడానికి ముందే 16వ లోక్‌సభ రద్దవడంతో ఈ బిల్లు మురిగిపోయింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పౌరసత్వ సవరణ బిల్లును మరో మారు తాజా సవరణలతో కేంద్రప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

ఆరు మతాలకు చెందినవారికే భారత పౌరసత్వం

పొరుగు దేశాలైన ఆఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి మతపరమైన దాడులు, హింస కారణంగా వేరే మార్గాల్లో వచ్చిన హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్శి, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ బిల్లులో ముస్లింలను మాత్రం చేర్చలేదు. దానికి కారణం రాజ్యాంగంలోనే వారి ప్రస్తావన స్పష్టంగా ఉండటమే. నేపాల్ , శ్రీలంక నుంచి వచ్చే మైనార్టీలపై కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పౌరసత్వం నిర్ధారణ మతం ప్రాతిపదిక కాకూడదని రాజ్యాంగ నిర్మాతలే చాలా స్పష్టంగా చెప్పారు. చట్ట సవరణ ఆమోదం పొంది బయటి దేశాల నుంచి వచ్చేవారిని తమ రాష్ట్రాల్లో పౌరసత్వం కల్పిస్తే ఇక్కడే పుట్టి పెరిగిన తమ తెగల మనుగడకే ముప్పు ఏర్పడుతుందని ఈశాన్య రాష్ట్రాలు భయపడుతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

భారతదేశము నా మాతృభూమి...." ప్రతిజ్ఞ "

శ్రీమద్భగవద్గీత

జీవితం